రివైజ్ కోర్స్ మురళి 24-01-1970
నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.
పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:
1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.
2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.
3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.
4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.
సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.
ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.
“బ్రాహ్మణుల ముఖ్య వృత్తి - సమర్పణ చెయ్యటము మరియు చేయించటము"
మీ జీవిత నావను ఎవరికి అప్పజెప్పారు? (శివబాబాకు) శ్రీమతముపై పూర్తిగా నడుస్తున్నారా? శ్రీమతముపై నడవటము అనగా ప్రతి కర్మలో అలౌకికతను తీసుకురావటము. స్వయమును శివబాబా వారసత్వమునకు పూర్తి అధికారులుగా భావిస్తున్నారా? ఎవరైతే వారసత్వమునకు అధికారిగా అవుతారో వారికి అన్నింటిపైన అధికారము ఉంటుంది, వారు ఏవిషయమునకూ అధీనమవ్వరు. ఒకవేళ దేహము, దేహ సంబంధీకులు లేక దేహమునకు చెందిన ఏ వస్తువులకైనా అధీనులైనట్లయితే అలా అధీనులయ్యేవారు అధికారులుగా అవ్వజాలరు. అధికారులు అధీనముగా అవ్వరు.
ఎల్లప్పుడూ తమను అధికారిగా భావించటం ద్వారా ఏవిధమైన మాయరూపమునకు అధీనమవ్వటము నుండి రక్షింపబడతారు. అలౌకిక కర్మలు ఎంత చేసాను మరియు లౌకిక కర్మలు ఎంత చేసాను అని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. అలౌకిక కర్మ ఇతరులు అలౌకికముగా తయారయ్యే ప్రేరణను ఇస్తుంది. మేమందరమూ ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలము, ఉన్నతోన్నతమైన రాజ్య పదవిని ప్రాప్తి చేసుకుంటాము అన్న లక్ష్యమును అందరూ ఉంచారా! లేక ఏది లభిస్తే అదే మంచిదా? ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలైనప్పుడు లక్ష్యమును కూడా ఉన్నతంగా ఉంచాలి. అవినాశీ ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే అవినాశీ సుఖపు ప్రాప్తి ఉంటుంది. ఆత్మ అవినాశి కదా!
మధువనమునకు వచ్చి మధువనపు వరదానమును ప్రాప్తి చేసుకున్నారా? వరదానము శ్రమ లేకుండా సహజముగానే లభిస్తుంది. అవ్యక్త స్థితిలో అవ్యక్త ఆనందము, అవ్యక్త స్నేహము, అవ్యక్త శక్తి వీటన్నింటి ప్రాప్తి సహజముగానే జరుగుతుంది. కావున అటువంటి వరదానము ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి, ఇందుకొరకు ప్రయత్నము చెయ్యవలసి ఉంటుంది. ఎల్లప్పుడూ వరదాత స్మృతిలో ఉండటం ద్వారా ఈ వరదానము అవినాశీగా ఉంటుంది. ఒకవేళ వరదాతను మర్చిపోయినట్లయితే వరదానము కూడా అంతమైపోతుంది. కావున వరదాతను ఎప్పుడూ వేరు చెయ్యవద్దు.
వరదాత తోడుగా ఉన్నట్లయితే వరదానము కూడా తోడుగా ఉంటుంది. మొత్తము సృష్టిలో అన్నింటికన్నా ప్రియమైన వస్తువు వారే(శివబాబానే), కనుక వారి స్మృతి కూడా స్వతహాగనే ఉండాలి. ప్రియమైనవాటిలో ప్రియమైనది ఒక్కటే అయినప్పుడు ఇక వారి స్మృతిని ఎందుకు మర్చిపోతారు? తప్పకుండా మరేదో గుర్తు వచ్చి ఉండాలి, కారణము లేకుండా ఏ విషయమూ ఉండదు. విస్మృతికి కూడా కారణము ఉంది. విస్మృతి కారణంగా ప్రియమైన వస్తువు దూరమౌతుంది. విసృతికి కారణము తమ బలహీనత, శ్రీమతమేదైతే లభించిందో దానిపై పూర్తిగా నడవని కారణంగా బలహీనత వస్తుంది, బలహీనత కారణంగా విస్మృతి జరుగుతుంది.
విస్మృతిలో ప్రియమైన వస్తువును మర్చిపోతారు. కావున ఎల్లప్పుడూ కర్మ చేసే ముందు శ్రీమతపు స్మృతిని ఉంచి తరువాత ప్రతి కర్మను చేసినట్లయితే ఆ కర్మ శ్రేష్ఠమవుతుంది. శ్రేష్ఠ కర్మ ద్వారా శ్రేష్ఠ జీవితము స్వతహాగనే తయారవుతుంది. కావున ప్రతి కార్యమునకు ముందు స్వయమును పరిశీలించుకోవాలి. కర్మ చేసిన తరువాత పరిశీలించుకోవటము వలన తప్పు కర్మ ఏదైతే జరిగిపోయిందో దానికైతే వికర్మ తయారైపోయిది కదా! కావున మొదట పరిశీలించుకోండి తరువాత కర్మ చెయ్యండి.
ఎవరిరైనా ఈశ్వరీయ చదువును చాలా సహజము మరియు సరళముగా ఇచ్చే విధానము వచ్చా? ఒక్క క్షణములో ఎవరికైనా తండ్రి పరిచయమును ఇవ్వగలరా? ఎంతగా ఇతరులకు పరిచయమును ఇస్తారో అంతగానే తమ భవిష్య ప్రాలబ్దమును కూడా తయారుచేసుకుంటారు. ఇక్కడ ఇవ్వటము, అక్కడ తీసుకోవటము అంటే తీసుకోవటమే అయింది. ఎంతగా ఇస్తుంటారో అంతగా తీసుకుంటున్నామని భావించండి. ఈ జ్ఞానపు ప్రత్యక్ష ఫలము, భవిష్య ప్రాలబ్దపు ప్రాప్తిని అనుభవము చెయ్యాలి. వర్తమాన ప్రాప్తి ఆధారముగానే భవిష్యత్తును తెలుసుకోగలరు.
వర్తమానపు అనుభవము భవిష్యత్తును స్పష్టము చేస్తుంది. మిమ్మల్ని ఏ రూపములో భావించుకుని నడుస్తారు? నేను శక్తిని, జగత్తుకు మాతను - ఈ భావన ఉంటుందా? ఎవరైతే జగత్ మాత రూపులో వారిలో జగత్ కల్యాణపు భావన ఉంటుంది. శివశక్తుల రూపములో ఎటువంటి బలహీనత ఉండదు. కావున నేను జగన్మాతను, శివశక్తిని - ఈ రెండు రూపాలను స్మృతిలో ఉంచుకోవాలి, అప్పుడే మాయాజీతులుగా అవుతారు. విశ్వ కల్యాణపు భావన ద్వారా అనేక ఆత్మల కల్యాణమునకు నిమిత్తులుగా అవుతారు. నష్టోమోహులుగా మీ సంబంధములతో, మీ శరీరముతో అయ్యారా?
నష్టోమోహపు చివరి స్థితి ఎంతవరకు ఉంది? ఎంతగా నష్టోమోహులుగా అవుతారో అంతగా స్మృతి రూపులుగా అవుతారు. కావున స్మృతిని సదా నిలిపి ఉంచుకునేందుకు సాధనము నష్టోమోహాగా అవ్వటము. నష్టోమోహగా అవ్వటము సహజమా లేక కష్టమా? ఎప్పుడైతే తమను తాము సమర్పణ చేసుకుంటారో అప్పుడిక అన్నీ సహజమైపోతాయి. ఒకవేళ సమర్పణ చెయ్యకుండా తమపై ఉంచుకుంటారో అప్పుడు కష్టమనిపిస్తుంది. సహజము చేసేందుకు ముఖ్య సాధనము - సమర్పణ చెయ్యటము. తండ్రికి ఏది కావాలో దానిని చేయించుకోవాలి.
ఏ విధంగా యంత్రము ద్వారా మొత్తము కార్ఖానా నడుస్తుందో, కార్ఖానాను నడిపించటము మషీను పని, అలాగే మనము నిమిత్తులము. నడిపించేవారు ఎలా నడిపిస్తే మనము అలా నడవాలి. ఇలా భావించటము ద్వారా కష్టమును అనుభవము చెయ్యరు. ఇటువంటి స్థితిని రోజురోజుకు పరిపక్వము చేసుకోవాలి. ముఖ్యమైన ఈ విషయముపై అటెన్షన్ ను ఉంచాలి. స్వయమును ఎంతగా తండ్రి ముందు సమర్పణ చేస్తారో అంతగానే తండ్రి కూడా అటువంటి పిల్లల ముందు సమర్పణ అవుతారు, అనగా తండ్రి ఖజానా ఏదైతే ఉందో అది స్వతహాగనే వారిదైపోతుంది. ఏ గుణమైతే మీలో ఉందో దానిని ఎవరికైనా ఇవ్వటము కష్టమెందుకనిపిస్తుంది?
సమర్పణ చెయ్యటము, చేయించటము - ఇదే బ్రాహ్మణుల వ్యాపారము. ఇది ఉన్నదే బ్రాహ్మణుల వ్యాపారమైనప్పుడు ఇది బ్రాహ్మణులకు కాక ఇతరులెవ్వరికి తెలుస్తుంది? తండ్రి ఏవిధంగా కొంచెముదానికి సంతోషపడరో అలా పిల్లలకు కూడా కొద్దిదానికి సంతోషము ఉండకూడదు. నిశ్చయమునకు గుర్తు ఏమిటి? విజయము. ఎంతగా నిశ్చయబుద్ది ఉంటుందో అంతగానే అన్ని విషయాలలో విజయం ఉంటుంది. నిశ్చయబుద్ధి కలవారికి ఎప్పుడు ఓటమి ఉండదు. ఓటమి ఉన్నట్లయితే నిశ్చయములో లోటు ఉన్నట్లుగా భావించాలి. నిశ్చయబుద్ధి విజయీ రత్నాలలో మేము కూడా ఒక రత్నము, ఇలా స్వయమును గూర్చి భావించాలి.
విఘ్నమైతే వస్తుంది, దానిని అంతము చేసేందుకు యుక్తి - ఇది ఒక పరీక్ష అని ఎల్లప్పుడూ భావించండి. ఈ పరీక్ష మీ స్థితిని పరిశీలన చేయిస్తుంది. ఏ విఘ్నము వచ్చినా కానీ దానిని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. విషయాన్ని చూడవద్దు కానీ పరీక్షగా భావించాలి. పరీక్షలో కూడా భిన్న భిన్నమైన ప్రశ్నలు ఉంటాయి - ఒక్కోసారి మనసు గురించి , ఒక్కోసారి లోకనిందల గురించి, ఒక్కోసారి దేశవాసీయుల గురించి ప్రశ్నలు వస్తాయి. కానీ ఇందులో గాభరా పడకూడదు. గూఢతలోకి వెళ్ళాలి. అనుకోకపోయినా ఆకర్షించబడి వచ్చే విధంగా వాతావరణాన్ని అలా తయారుచేయాలి.
స్వయము ఎంతగా అవ్యక్త వాయుమండలమును తయారుచేసేందులో బిజీగా ఉంటారో అంతగా స్వతహాగనే అన్నీ జరుగుతూ ఉంటాయి. దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా సుగంధము వచ్చినట్లయితే వెళ్ళి అదేంటో చూడాలని ఏవిధంగా మనసుకనిపిస్తుందో, అలాగే ఈ అవ్యక్త సుగంధము కూడా వద్దనుకున్నా ఆకర్షిస్తుంది. ఏ లక్ష్యమునైతే ఉంచటము జరిగిందో దానిని పూర్తి చేసేందుకు అటువంటి లక్షణాలను కూడా మీలో నింపుకోవాలి. బలహీనమైన ప్రయత్నము చేసేవారు ఎంతవరకు చేరుకుంటారు? ప్రయత్నము అన్న మాటనే అంటూ ఉంటే ప్రయత్నములోనే ఉండిపోతారు. చెయ్యవలసిందే అన్న లక్ష్యమునైతే ఉంచాలి.
ప్రయత్నము అన్న మాటను అనటము బలహీనత. బలహీనతను తొలగించేందుకు ప్రయత్నము అన్న మాటను తొలగించాలి. నిశ్చయముద్వారా విజయము లభిస్తుంది. సంశయమును తీసుకురావటము ద్వారా శక్తి తక్కువైపోతుంది. నిశ్చయబుద్ధిగా అయినట్లయితే అందరి సహయోగము కూడా లభిస్తుంది. ఏదేని కార్యమును చెయ్యవలసి ఉన్నప్పుడు నేను తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు అనే ఆలోచిస్తారు, అప్పుడే సఫలత లభిస్తుంది. ఇప్పటినుండి ప్రయత్నము అన్న మాటను అంతము చేసెయ్యండి. నేను శివశక్తిని. శివశక్తి అన్ని కార్యములను చెయ్యగలదు. శక్తులను పులిపై స్వారీ చేస్తున్నట్లుగా చూపిస్తారు.
మాయ పులి రూపములో ఎలా వచ్చినా భయపడకూడదు. శివశక్తులు ఎప్పుడూ ఓడిపోజాలరు. ఇప్పుడు సమయము కూడా ఎక్కడ ఉంది? సమయమునకు ముందే స్వయమును మార్చుకోవటం ద్వారా ఒకటికి లక్ష రెట్లు లభిస్తుంది. మారవలసిందే, కావున అలా మారాలి. ముందు కల్పము కూడా వారసత్వము తీసుకున్నాను అన్నది గుర్తుకు వస్తుంది. మిమ్మల్ని పాతవారిగా భావించటము ద్వారా, కల్పము ముందట సృతి రావటం ద్వారా పురుషార్ధము సహజమైపోతుంది. కల్పపూర్వము కూడా నేను తీసుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకునే తీరుతాను అన్న నిశ్చయము ఉంటుంది.
కల్పపూర్వపు స్మృతి శక్తిని ఇప్పించేదిగా ఉంటుంది. స్వయమును క్రొత్త వారిగా భావించినట్లయితే పొందగలనో లేదో అన్న బలహీనపు సంకల్పము వస్తుంది. కానీ నేను కల్పపూర్వపు ఆత్మను అన్న స్మృతి ద్వారా శక్తి వస్తుంది. ఎల్లప్పుడూ స్వయమును ధైర్యవంతులుగా తయారుచేసుకోవాలి. ధైర్యము పోకూడదు. ధైర్యము ద్వారా సహాయము కూడా లభిస్తుంది. మేము సర్వ శక్తివంతుడైన తండ్రి పిల్లలము, తండ్రిని స్మృతి చేస్తాము, ఇదే ధైర్యము. తండ్రిని స్మృతి చెయ్యటము సహజమా లేక కష్టమా? సహజము చెయ్యటముతో సహజమైపోతుంది.. నా కర్తవ్యమే ఇది, ఇది నా బాధ్యత. ఏం చేయాలి?......
ఈ సంకల్పము రావటంతో కష్టమైపోతుంది. ఎప్పుడూ మీలో బలహీనపు సంకల్పమును ఉండనివ్వకూడదు. ఒకవేళ మనస్సులో బలహీనపు సంకల్పము ఉత్పన్నమైనా కానీ, వాటిని అక్కడే సమాప్తము చేసి శక్తి శాలిగా తయారు చేయాలి. ఇప్పటివరకు కూడా ప్రయత్నము చేస్తూ ఉన్నట్లయితే అవ్యక్త ఆకర్షణ యొక్క అనుభవమును ఎప్పుడు చేస్తారు? ఎప్పటివరకైతే ప్రయత్నము ఉంటుందో అప్పటివరకు అవ్యక్త ఆకర్షణ మీలోకి రాజాలదు. ఇటువంటి భాష కూడా బలహీనమైనది. సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలు ఇలా మాట్లాడజాలరు. వారి సంకల్పము, వాణి అన్నీ నిశ్చయము కలిగినవిగా ఉంటాయి.
అటువంటి స్థితిని తయారుచేసుకోవాలి. సంకల్పరూపీ ఫౌండేషన్ దృఢంగా ఉందా అని ఎల్లప్పుడూ పరిశీలించుకోవాలి. తీవ్ర పురుషార్థుల నడవడికలో వారి సంకల్పము, వాణి, కర్మ మూడు కూడా ఒకే విధంగా ఉండే విశేషత ఉంటుంది. సంకల్పము ఉన్నతంగా మరియు కర్మలు బలహీనంగా ఉన్నట్లయితే వారిని తీవ్ర పురుషార్థులు అని అనరు. మూడింటిలో సమానత ఉండాలి. అప్పుడప్పుడూ తన రూపాన్ని చూపించే ఈ మాయ సదాకాలము కొరకు వీడ్కోలు తీసుకోవటానికే వస్తుంది అని ఎల్లప్పుడూ భావించాలి.
వీడ్కోలుకు బదులుగా నిమంత్రణను ఇచ్చేస్తారు. ఎల్లప్పుడూ శివబాబాతోటి ఉన్నాను, వారినుండి వేరుగా కానే కానప్పుడు ఎవరైనా ఏం చెయ్యగలరు? ఎవరైనా బిజీగా ఉంటే మూడోవారు డిస్టర్బ్ చెయ్యరు. విసిగించేవారు ఎవ్వరూ రాకూడదు అని భావిస్తారు, కావున ఒక బోర్డును పెడ్తారు. మీరు కూడా అటువంటి బోర్డును పెట్టినట్లయితే మాయ తిరిగి వెళ్ళిపోతుంది, రావటానికి స్థానముకూడా లభించదు. కుర్చీ ఖాళీగా ఉన్నట్లయితే ఎవరైనా కూర్చుంటారు.
మాతలకైతే చాలా సులభము, కేవలము తండ్రిని స్మృతి చెయ్యండి, అంతే. తండ్రిని స్మృతి చెయ్యటము ద్వారా జ్ఞానము దానికదే ఇమర్జ్ అయిపోతుంది. తండ్రిని ఎవరైతే స్మృతి చేస్తారో వారికి ప్రతి కార్యములో తండ్రి సహాయము లభిస్తుంది. స్మృతికి ఎంతటి శక్తి ఉందంటే ఏ అనుభవమునైతే ఇక్కడ పొందుతారో వారు అక్కడ కూడా స్మృతిలో ఉంటారు కావున అవినాశిగా అయిపోతారు. మేము పరంధామ నివాసులము అని బుద్ధిలో మాటిమాటికీ దీనినే స్మృతిలో ఉంచుకోండి. కర్తవ్యము చేయటము కొరకు ఇక్కడకు వచ్చాము, తిరిగి వెళ్ళాలి.
ఈ విషయాలలో బుద్ధిని చాలా బిజీగా ఉంచినట్లయితే ఇక భ్రమించరు. ఎవరికైనా జ్ఞానాన్ని కూడా చాలా యుక్తిగా వినిపించాలి. నేరుగా జ్ఞానాన్ని వినిపించటం ద్వారా గాభరా పడిపోతారు. మొదటైతే ఈశ్వరీయ స్నేహములోకి ఆకర్షించాలి. శరీరధారులకు ధనము కావాలి, బాబాకు మనస్సు కావాలి. కావున మనస్సును ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడనే ఉంచాలి కానీ మరోచోట ఎక్కడా ప్రయోగించకూడదు. యోగయుక్త అవ్యక్త స్థితిలో ఉండి రెండు మాటలు మాట్లాడటము కూడా భాషణ చెయ్యటమే అవుతుంది. ఒక గంట భాషణలోని సారాన్ని రెండు మాటలలో వినిపించగలగాలి.
దిన ప్రతిదినము అడుగు ముందుకు వేస్తున్నట్లు భావిస్తున్నారా? ఇప్పుడు సమయము చాలా ఉంది, పురుషార్ధము చేయొచ్చులే అని ఇలా కూడా ఆలోచించవద్దు. సమయానికి ముందే సమాప్తము చేసి ఈ స్థితి యొక్క అనుభవమును ప్రాప్తి చేసుకోవాలి. ఒకవేళ సమయము వచ్చినప్పుడు ఈ స్థితిని అనుభవము చేసినట్లయితే సమయముతో పాటు స్థితి కూడా మారిపోతుంది. సమయము పూర్తయిపోతే అప్పుడిక అవ్యక్త స్థితి అనుభవము కూడా సమాప్తమౌతుంది, మరొక పాత్ర వచ్చేస్తుంది. కావున మొదటినుంచే అవ్యక్త స్థితిని అనుభవము చెయ్యాలి. పరుగెత్తటంలో కుమారీలు చాలా చురుకుగా ఉంటారు.
కావున ఈ ఈశ్వరీయ పరుగులో కూడా చురుకుగా వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేవారే ఫస్ట్ కు సమీపంగా వస్తారు. సాకారుడు ఫస్ట్ వెళ్ళారు కదా! లక్ష్యమునైతే ఉన్నతంగా ఉంచాలి. లక్ష్యము సంపూర్ణమైనప్పుడు పురుషార్ధము కూడా సంపూర్ణంగా చెయ్యాలి, అప్పుడే సంపూర్ణ పదవి లభించగలదు. సంపూర్ణ పురుషార్ధము అనగా అన్ని విషయాలలో తమను సంపన్నంగా తయారుచేసుకోవటము. ఇది పెద్ద విషయమైతే కానే కాదు. తెలుసుకున్న తరువాత స్మృతి చెయ్యటమేమన్నా కష్టమనిపిస్తుందా? తెలుసుకోవటమునే జ్ఞానము అని అంటారు. ఒకవేళ జ్ఞానపు లైట్, మైట్ లేనట్లయితే ఆ జ్ఞానము ఎందుకు పనికి వస్తుంది? దానిని తెలుసుకోవటము అని అనరు.
ఇక్కడ తెలుసుకోవటము మరియు చెయ్యటము ఒక్కటే, ఇతరులలో తెలుసుకోవటము,చెయ్యటములో అంతరము ఉంటుంది. జ్ఞానము ఎటువంటిదంటే, అది ఆ రూపమును తయారు చేసేస్తుంది. ఈశ్వరీయ జ్ఞానము ఏ రూపాన్ని తయారుచేస్తుంది? ఈశ్వరీయ స్థితి. ఈశ్వరీయ జ్ఞానమును తీసుకునేవారు ఈశ్వరీయ రూపములోకి ఎందుకని రాలేరు! థియరీ ఒక సంగతి, తెలుసుకోవటము అనగా బుద్దిలో ధారణ చెయ్యటము మరొక సంగతి. ధారణ ద్వారా కర్మ దానంతట అదే అయిపోతుంది. ధారణకు అర్ధమే ఆ విషయాన్ని బుద్ధిలో నిలుపుకోవటము.
ఎప్పుడైతే బుద్ధిలో నిలుపుకుంటారో అప్పుడిక బుద్ధి డైరెక్షన్ అనుసారంగా కర్మేంద్రియాలు కూడా దానిని చేస్తాయి. జ్ఞాన సంపన్నులైన తండ్రికి మనము పిల్లలము, ఈశ్వరీయ జ్ఞానపు లైట్-మైట్ మనతోటి ఉన్నాయి, ఇలా భావిస్తూ నడవాలి. జ్ఞానమును కేవలము వినటము వేరు, కేవలము వినటము కాకుండా దానిని నింపుకోవాలి. భోజనము చెయ్యటము వేరు, దానిని జీర్ణము చేసుకోవటము వేరు. తినటము ద్వారా శక్తి రాదు, జీర్ణము చేసుకోవటము ద్వారా శక్తి ఎక్కడి నుండి వస్తుంది, తిన్న భోజనాన్ని జీర్ణము చేసుకోవటము ద్వారానే శక్తి రూపముగా తయారవుతుంది.
శక్తివంతుడైన తండ్రి పిల్లలు, ఏమీ చెయ్యలేరు, ఇలా జరగగలదా? లేకపోతే తండ్రి పేరును కూడా సిగ్గుపడేలా చేస్తారు. మేము ఎటువంటి కర్మలను చెయ్యాలంటే, అవి ఉదాహరణరూపంగా అయ్యి చూపించాలి అన్న లక్ష్యముగా ఎల్లప్పుడూ ఉంచాలి. ఎదురు చూడటములో ఉండవద్దు, ఉదాహరణగా అవ్వాలి. తండ్రి ఉదాహరణగా అయ్యారు కదా! మీ ఇంటికి వచ్చారని భావిస్తున్నారా? ఎవరైనా దారితప్పి తిరుగుతున్నవారు తిరిగి తమ ఇంటికి చేరుకుంటే చాలా విశ్రాంతి లభిస్తుంది. ఇక్కడ విశ్రాంతి భావన కలుగుతుంది. స్థానము లభించటంతో విశ్రామ స్థితి కలుగుతుంది.
ఎల్లప్పుడూ విశ్రమ స్థితిగా భావించండి. కార్యము చెయ్యటం కొరకు వెళ్ళినాగానీ ఈ స్థితి యొక్క అనుభవమును తోడుగా తీసుకుని వెళ్ళాలి. దీనిని తోడు ఉంచుకున్నట్లయితే ఎంత పెద్ద కార్యము చేస్తున్నా స్థితి అన్నది విశ్రాంతిగా ఉంటుంది. విశ్రాంతి స్థితిలో సుఖ-శాంతుల అనుభవము ఉంటుంది. స్వయములో ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడిక వాతావరణపు ప్రభావము కూడా మీపై ఉండదు, కానీ మీ ప్రభావము వాతావరణముపై ఉంటుంది. సర్వశక్తివంతమైనది వాతావరణమా లేక తండ్రినా? సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలైనప్పుడు మరి వాతావరణము మీకంటే శక్తిశాలిగా ఎందుకు ఉంటుంది?
మీ శక్తిని మరిచిపోవటము కారణంగానే వాతావరణ ప్రభావము ఉంటుంది. ఏవిధంగా డాక్టరు ఏ రోగము కలిగిన పేషెంటు వద్దకు వెళ్ళినా వారిపై ప్రభావము ఉండదో, అలాగే మీ స్మతిని ఉంచుకొని సేవ చెయ్యాలి. మేము వాతావరణాన్ని తయారు చెయ్యాలే కానీ వాతావరణము మమ్మల్ని తయారుచేయకూడదు అని మీలో శక్తిని ఉంచుకోండి. యుగళులుగా ఉన్నా కానీ ఒంటరి ఆత్మను అన్న స్మృతిలో ఉంటారా? ఆత్మ ఒంటరిది కదా, ఒకవేళ ఆత్మకు సంబంధములోకి రావాలన్నా కానీ ఎవరి సంబంధములోకి రావాలి? సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? ఒక్కరితో. కావున ఒక్కరి నుండి ఇద్దరిగా కూడా అవ్వాలి, తండ్రి-పిల్లలు. మూడవ సంబంధమేమీ లేదు.
సర్వ సంబంధాలను ఒక్కరితోనే జోడించాలి. ఒకరితరువాత ఇంకొకరు శివబాబా, ఇటువంటి స్థితినే ఉన్నత స్థితి అని అంటారు. మూడవదేది చూసినాగానీ కనిపించకూడదు. ఒకవేళ చూడాలనుకున్నా ఒక్కరినే, మాట్లాడటము కూడా వారితోనే. ఇటువంటి స్థితి ఉండటము ద్వారా మాయాజీతులుగా అవుతారు. ఎవరైతే మాయాజీతులవుతారో వారు జగజ్జీతులుగా అవుతారు. ఇటువంటి శుద్ధ స్నేహము మొత్తం కల్పములో ఒక్కసారే లభిస్తుంది. అటువంటి స్నేహమును మనం పొందుతాము అన్న దానిని ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవాలి. ఇతరులేవ్వరికీ లభించలేనిది మనకు లభించింది. ఈ నషా మరియు నిశ్చయములో ఉండాలి. అచ్ఛా!
మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.
మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.
01.02.1979
23.12.1987
10.01.1988
07.04.1981
దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.
"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.
జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.
జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.
మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.
మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.