రివైజ్ కోర్స్ మురళి 23-11-1979      

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

నమ్రత అనే కవచం ద్వారా స్నేహం మరియు సహయోగం లభిస్తాయి

                ఈరోజు సేవాధారీల గ్రూపు, మధువననివాసీయులు అంటే సేవాధారీలు. ఎలాగైతే బ్రహ్మబాబా మొదటి నెంబర్ విశ్వ సేవాధారియో అలాగే మధువన నివాసీయులు అంటే బేహద్ సేవాధారులు. బేహద్ సేవాధారులలో బేహద్ గుణాలు ఉంటాయి. బాబాని చూసారు కదా - చూడటం కూడా బేహద్ దృష్టితో, మాటలు కూడా బేహద్ మాటలు వినటం మరియు వినిపించటం ఈ సంబంధ సంప్రదింపుల్లో కూడా బేహద్ సంబంధం, ప్రతి సంకల్పంలో కూడా బేహద్ కళ్యాణం ఎలా అవుతుంది అనేదే ఉండేది.

సంస్కారంలో కూడా బేహద్ త్యాగం మరియు బేహద్ తపస్సు ఉండేవి. కేవలం రెండు లేదా నాలుగు గంటల తపస్సు కాదు. బేహద్ తపస్సు అనగా ప్రతి సెకను తపస్యా స్వరూపం, తపస్యా మూర్తి. మూర్తి మరియు ముఖంలో త్యాగం, తపస్సు మరియు సేవ సదా సాకారరూపంలో ప్రత్యక్షంగా చూసారు. బ్రహ్మబాబా ఎలాగైతే మధువననివాసియో మరియు మధువనం యొక్క బాబా అని అంటారు కదా! అటువంటి భూమిలో నివసించే మధువన నివాసీయులు లేదా సేవాధారులు బ్రహ్మాబాబాను అనుసరిస్తున్నారు. ప్రజలు మధువనమై నివాసీయుల గుణాలను గానం చేస్తారు.

మధువన నివాసీయులు అంటే గుణ మూర్తులు. ఇలా బేహద్ స్థితిలో స్థితులై ఉన్నారా? అల్లా ఉద్దీన్ అద్భుత దీపమై నడుస్తున్నారా? అల్లా ఉద్దీన్ అద్భుత దీపం చాలా ప్రసిద్ది కదా! ఈ దీపం ద్వారా ఏది చూడాలంటే అది చూడవచ్చు, ఏది పొందాలంటే అది పొందువచ్చు. అలాగే మధువన నివాసీయులు అల్లా ఉద్దీన్ దీపంలాంటి వారు. ఒక్క సెకనులో ఇంటిని మరియు రాజ్యాన్ని చూపించేవారు అంటే ముక్తి, జీవన్ముక్తి ఇచ్చేవారు. మహిమ అయితే ఇంత గొప్పగా ఉంది. కానీ మిమ్మల్ని మీరు అంత గొప్పగా భావించి నడుస్తున్నారా?  ఫలితంలో అందరికంటే మొదటి నెంబర్ మధువన నివాసీయులు రావాలా లేక వచ్చేశారా?

ఎప్పటివరకు "కావాలి” అనే మాట ఉంటుందో లేదా ఇలా జరగాలి అని అంటారో అప్పుడు విశ్వంలోని సర్వాత్మల కోరికలను ఎలా పూర్తి చేయగలరు? ఎలాగైతే ఏదైనా శక్తివంతమైన బాంబ్ పడగానే మొత్తం భూమి అంతా మారిపోతుంది కదా! అలాగే మధువన నివాసీయులు కూడా ఈ అభ్యాసం అనే శక్తివంతమైన బాంబులను అంతర్భూమిలో తయారుచేయాలి, వాటిని తిరిగి ఇక్కడే ప్రయోగించి చూడాలి. వస్తువు ఎంత శక్తివంతమైనదిగా ఉంటుందో అది అంత సూక్ష్మంగా ఉంటుంది. వస్తువు చిన్నదే ఉంటుంది. కానీ చాలా పెద్ద పని చేస్తుంది.

అలాగే ఈ తరంగాలు కూడా నాలుగు వైపులా వ్యాపించేలా ఏదైనా క్రొత్త విషయం కనిపెట్టండి. అవ్వాల్సిందే అనే సంకల్పం అయితే అందరికీ ఉంది. కానీ ఎందుకు అవ్వటంలేదు? దానికి కారణం ఏమిటి? ప్రత్యక్షంగా జరగటంలో ఎందుకు లోపం వస్తుంది? “అవ్వాలి" అనే సంకల్పానికి అడ్డుపడే గోడ ఏది? ఒకవైపు ఇది అవ్వాలి అనే సంకల్పం వస్తుంది. మరోవైపు ఇలా అంతిమ సమయంలో అవుతుంది అనే సంకల్పం కూడా వస్తుంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. ఇలాగే నడుస్తుంది... ఇలాంటి వ్యర్థ సంకల్పాలు అనే ఇటుకల గోడ అడ్డుగా వస్తుంది, అది పురుషార్థం యొక్క తీవ్రగతిని ఆపేస్తుంది.

దీనిని ఒక దృఢ సంకల్పంతో దుమికి దాటేయాలి; అది ఏమిటి? చేసి చూపిస్తాను" అని ప్రతీ ఒక్కరు అనుకోవాలి. అవ్వాలి అనడానికి బదులు చేసి చూపిస్తాను అనే ధృఢ సంకల్పం ఎవరికి వారు చేయాలి. ఇతరులను చూడకండి, వినకండి..ఇలా ఒక్కొక్కరూ కలిసి సంఘటన అయిపోతుంది. 1, 2 కలసి 12 అవుతుంది. ఇలా ముందుకు దుమకండి. అప్పుడే బాబా సమానంగా బేహద్ సేవాధారిగా కాగలరు. అర్థమైందా సేవాధారుల గొప్పతనం ఏమిటో? మొదట ఈ సేవ. వేర్వేరు గ్రూపులను తయారుచేయండి. ఆదిలో పురుషార్థీల గ్రూపు ఉండేది. విశేష పురుషార్థీల గ్రూపు ఉండేది.

దానిలో మీ కోసం ఒక వారం రోజులకు ప్లాన్ తయారుచేసుకోండి - అమృతవేళ ఏమి సంకల్పం చేయాలి? క్లాసులో ఏమి విశేషత తీసుకురావాలి? కర్మ చేసేటప్పుడు ఏమి లక్ష్యం ఉంచుకోవాలి? సాయంత్రం యోగంలో ఏమి విశేష ధ్యాస ఉంచుకోవాలి? విహరిస్తూ ఏ రకంగా మనసా సేవ చేసి తరంగాలను వ్యాపింప చేయాలి? రాత్రి ఏ విషయాలను పరిశీలించుకోవాలి? ఇలా గ్రూపుగా తయారై పోటీ చేయండి. ఇలాంటి మానసిక ఉల్లాసం ఉండాలి. ఏదైనా కార్యక్రమంలో అయితే అల్పకాలికంగా చేస్తారు, కానీ మనస్సు యొక్క సంకల్పం అయితే అవినాశీగా ఉంటుంది.

చేస్తాం మరియు ఫలితం చూపిస్తాం అని సంకల్పం చేయాలి, అప్పుడే నలువైపుల తరంగాలు వ్యాపిస్తాయి. ఒక సమయంలో ఒకే సేవ కాదు, రెండు సేవలు చేయండి. మధువనం అనేది విశ్వమంతటిలో ఉన్నతమైన స్థంభం. ఎక్కడి నుండి చూసినా కానీ అనగా దూరం నుండి చూసినా, దగ్గర నుండి చూసినా స్థంభం అనేది ఎత్తుగానే కనిపిస్తుంది. స్థంభం ఎత్తుగా ఉంటే అందరి దృష్టి దానివైపుకి వెళ్తుంది, ఇదే విశేష బేహద్ సేవ. అడుగడుగులో బ్రహ్మబాబా సమానంగా నడవాలి. బ్రహ్మబాబాని చూసారు కదా - రాత్రి మేలుకుని కూడా తరంగాలను వ్యాపింపచేయాలని ఆలోచించేవారు. అలాగే పిల్లలందరికీ ఇలాంటి ఆలోచనలే నడవాలి.

ఏదైనా కార్యక్రమం ఉంటే చేస్తాం అని అనకూడదు. ఈ విషయంలో అందరూ చేయండి మరియు చేయించండి. చేసిన వారే అర్జునులు. మీరు అందరినీ చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతారు. ఎవరు చేస్తారో వారిని అందరూ అనుకరిస్తారు. రొట్టెలు తయారుచేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా కానీ శక్తిశాలీ స్మృతి స్వరూపంగా ఉండాలి. మనస్సు ద్వారా విశ్వసేవ చేయండి. విశ్వసేవాధారులు ఒక పని కాదు, రెండు పనులు చేస్తారు. స్థూలంగా చేతులు పనిచేస్తున్నా కానీ మనస్సు ద్వారా శక్తుల యొక్క దానం ఇస్తారు. సేవా సమయంలో సదా ఇదే ధ్యాస ఉంచుకోండి, గుణమూర్తి అయ్యి సేవ చేయాలని. అప్పుడు డబుల్ సంపాదన అవుతుంది.

సదా డబుల్ సేవ చేయండి. మిమ్మల్ని మీరు విశ్వ పరివర్తనకు నిమిత్తంగా భావించండి. నేను నిమిత్తం అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఉపన్యాసంలో చెప్తారు కదా - ముందు స్వయాన్ని మార్చుకోండి. అప్పుడు విశ్వం మారిపోతుందని. ఈ విషయం మీ కోసం కూడా కదా! ఇతరుల పొరపాటుని చూసి స్వయం పొరపాటు చేయకండి. ఇతరుల పొరపాటు కనిపిస్తుంది కానీ నేను కూడా పొరపాటు చేస్తున్నాను అనేది కనిపించదు. ఎవరైనా ఒకరు చెడు మాట్లాడుతూ ఉంటే వారి సాంగత్యం ద్వారా మీరు కూడా చెడు మాట్లాడితే సాంగత్యం యొక్క రంగు అంటుకున్నట్లే కదా!

ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తున్నా కానీ మనం మాత్రం సరిగ్గా ఉండాలి. వారి సాంగత్యం యొక్క ప్రభావంలోకి రాకూడదు. ప్రభావంలోకి రావటం వలన సోమరితనంగా అయిపోతారు. ఈ విషయంలో పాండవులు ముందుకి వెళ్తారా లేక శక్తులా? కేవలం ఒక్క బాధ్యత తీసుకోండి  - నేను సరైన మార్గంలోనే ఉంటాను అని, తప్పుని చూసి నేను తప్పు చేయను. ఒకవేళ ఇతరులు ఎవరైనా పొరపాటు చేస్తుంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఈ సంకల్పం అందరూ పెట్టుకుంటే సహజంగానే విశ్వ పరివర్తన అయిపోతుంది. ఇది చేయలేరా? అంటే ఏదోక ప్లాన్ తయారు చేయండి.

క్రొత్త సంవత్సరంలో ఏదోక క్రొత్త కార్యం చేసి చూపించాలి. ఒకరికొకరు శుభభావన యొక్క సహయోగం ఇవ్వండి. ఎవరి పొరపాటుని మనసులో ఉంచుకోకండి. వారికి సహయోగం ఇచ్చి నిండుగా చేయండి. శివశక్తిగా తయారుచేయండి. ఇలా చేసారు, వారు అలా చేసారని అస్సలు చూడవద్దు. వినవద్దు. లేకపోతే సోమరితనం యొక్క సంస్కారం గట్టిగా అయిపోతుంది. ఇతరులని చూసి ఇతరుల గురించి వింటూ ఉంటే స్వయం సోమరిగా అయిపోతారు. సమయప్రమాణంగా ఇప్పుడు వ్యర్థం యొక్క నామరూపాలను కూడా సమాప్తి చేయండి. వ్యర్థం మాట్లాడకండి, వ్యర్ధ కర్మలు చేయకండి, వ్యర్థ సాంగత్యం చేయకండి.

వ్యర్ధ సాంగత్యం కూడా సమయాన్ని మరియు శక్తిని సమాప్తి చేసేస్తుంది. అయితే ఈ సంవత్సరం ఏమి జెండా ఎగురవేస్తారు? మీలో లోపం వెతకాలని ఎవరు ఎంత ప్రయత్నించినా కానీ మీలో కొద్దిగా కూడా పాత స్వభావ సంస్కారాల అలజడి కనిపించకూడదు. ఒకవేళ ఈరోజే అందరూ ఈ దృఢ సంకల్పం చేసి వ్యర్థం అనే రావణుడిని కాల్చేస్తే ఏమవుతుంది? సత్యమైన దీపావళి అవుతుంది. ఈ ప్రతిజ్ఞ చేయండి - ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని నిందించినా, అవమానపర్చినా సాధువుగా అయిపోండి. నిందించినవారిపై కూడా పూలవర్షం కురిపించండి. వారు ఇలా అన్నారు.

అందువలనే ఇలా అయ్యింది అని అనకండి. ఎవరు ఏం చేసినా, ఒకవేళ తప్పు చేసినా కూడా మీరు మాత్రం సరిగ్గానే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని 10 మాటలు అన్నారు, మీరు వారిని ఒక్కమాట అన్నారు అయినా కానీ కమలపుష్ప సమానంగా కాలేదు కదా! మనపై నీటి బిందువు పడిపోయింది. ఎవరైనా మీతో గొడవపడినా కానీ మీరు మాత్రం వారికి స్నేహం అనే నీరుని ఇవ్వండి. దీనితో వారి అగ్ని చల్లారిపోతుంది. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అన్నారంటే వారిపై నూనె వేసినట్లే. సదా నమ్రత అనే దుస్తులు ధరించి ఉండాలి. నమ్రత అనేది కవచం. కవచాన్ని తీసేస్తున్నారు.

ఎక్కడ నమ్రత ఉంటుందో అక్కడ స్నేహం మరియు సహయోగం స్వతహాగానే ఉంటాయి. ఎక్కడ స్నేహం, సహయోగం ఉంటాయో అక్కడ అగ్నిలో నూనె వేయరు. అయితే ఈ సంవత్సరం  ప్రతి ఒక్కరూ ఏమి చేస్తారు? సంస్కారాలు అయితే రకరకాలుగా ఉంటాయి. కానీ ఆ సంస్కారాల యొక్క ప్రభావం మీపై ఉండకూడదు. సంస్కారాలు అయితే అంతిమం వరకు కొంతమందికి దాసీ సంస్కారాలు ఉంటాయి, కొంతమందికి రాజా సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలు మారిపోవాలి అని ఎదురుగా చూడకండి. కానీ నాపై ఎటువంటి ప్రభావం పడకూడదు అని అనుకోవాలి. ఎందుకంటే 1.ప్రతీ ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. 2. ఎవరో ఒకరు మాయారూపంగా అయ్యి వస్తూనే ఉంటారు.

ఇది అయితే సమాప్తి అయిపోదు. కానీ దానిలో స్వయం సాక్షిగా మరియు కమలపుష్ప సమానంగా రక్షణగా ఉండాలి. ఇదయితే చేయగలరు కదా? మాట్లాడేవారు మాట్లాడినా కానీ, వినేవారు వినకుండా ఉండవచ్చు కదా! మర్యాద అనే రేఖ లోపల ఉండి ఏ విషయాన్ని అయినా నిర్ణయించండి. సంస్కారాలు రకరకాలుగా ఉన్నా కానీ ఘర్షణ ఉండకూడదు. దీని కోసం ఙ్ఞానసాగరులు అయిపోండి. మేము విశ్వ కళ్యాణకారులం అని చెప్తున్నారు కదా! అంటే తప్పకుండా ఎవరో ఒకరు అకళ్యాణకారిగా ఉంటారు కదా, అప్పుడే మీరు కళ్యాణం చేయగలరు.

ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తుంటే వారిని పరవశ ఆత్మగా భావించి వారిని దయా దృష్టితో పరివర్తన చేయండి, చర్చించకండి. ఎవరైనా రాయి అడ్డు వచ్చి ఆగిపోయినా కానీ మీరు మాత్రం దాటి వెళ్ళిపోవాలి మరియు వారిని కూడా మీ తోడుగా చేసుకుని దాటించాలి. అంత ధైర్యం లేకపోతే స్వయం మాత్రం ఆగకండి, దాటుకుంటూ వెళ్ళిపోండి. ఈ ధ్యాస ఉండాలి. చూడాలనుకుంటే విశేషతలను చూడండి, వదలాలనుకుంటే బలహీనతలను వదలండి. సంప్రదింపుల్లోకి రావలసి ఉంటుంది, చూడవలసి వస్తుందంటే విశేషతనే చూడాలి లేదా బాబాను చూడండి.

ప్రతీ ఒక్కరూ  ఇదే సంకల్పం తీసుకోవాలి - "మేము శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను వ్యాపింపచేయాలి. " తపస్వీమూర్తియై ఉండాలి. ఒకరికొకరు మనస్సు ద్వారా, మాట ద్వారా కూడా సావధానపర్చుకునే సమయం కూడా కాదు. ఇప్పుడు మనసా శుభ భావన ద్వారా ఒకరికొకరు సహయోగి అయ్యి ముందుకు వెళ్ళండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

మాస్టర్ దు:ఖహర్త, సుఖకర్త భవ!