రివైజ్ కోర్స్ మురళి 13-06-1982                                                 

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

ముఖ్య సేవాధారి అక్కయ్యల (టీచర్స్) సంఘటనలో అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు

         

                    ఈరోజు పిల్లల యొక్క సంఘటన, స్నేహం, సహయోగం, పరివర్తన యొక్క ధృడ సంకల్పం యొక్క సువాసనను తీసుకునేటందుకు బాబా వచ్చారు. పిల్లల సంతోషంలోనే బాప్ దాదాకి సంతోషం ఉంటుంది. ఈ అవినాశి సంతోషం లేదా అవినాశి సువాసన సదా ఉండాలి అనే అవినాశి సంకల్పం చేశారు కదా! మొట్టమొదట్లో ఆది స్థాపనా సమయంలో ఒకరికొకరు ఏమి వ్రాసుకునేవారు, లేదా చెప్పుకునేవారు, జ్ఞాపకం ఉందా? ప్రియమైన నిజ ఆత్మకి అనే మాట అనేవారు. ఆత్మాభిమానిగా తయారయ్యే లేదా తయారుచేసే సహజ సాధనం ఇదే ఉండేది. నామరూపాలు చూసేవారు కాదు.

అభ్యాసం చేసిన ఆ రోజులు జ్ఞాపకం ఉన్నాయా? ఎంత సహజంగా అనిపించేది? శ్రమ చేయవలసి వచ్చిందా? ఈ ఆది మాటనే గుహ్య రహస్య సహితంగా ధారణలోకి తీసుకురండి. అప్పుడు స్వతహాగానే స్మృతి స్వరూపం అయిపోతారు. ఒకటి అనే మంత్రం స్మృతి ఉండాలి. ఒకే తండ్రి, ఒకే ఇల్లు, ఏకమతం, ఏకరసం, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే పేరు, ఒకే ఆత్మ, ఒకే రూపం. ఇలా ఒకటి అనే మంత్రం సదా జ్ఞాపకం ఉంచుకుంటే ఏమి అవుతుంది? సర్వులలో ఒకరే కనిపిస్తారు. ఇది సహజం కదా!

 ఇలా ఒకరే కనిపించినప్పుడు నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే పాట ఏదైతే మీరు పాడుతున్నారో ఆ స్థితి స్వతహాగానే ఉంటుంది. ఇదే సంకల్పం చేశారు కదా! బాప్ దాదా అయితే కేవలం నయనాల కలయిక జరపడానికి వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు బాబా వచ్చారు. పిల్లల యొక్క స్నేహానికి తండ్రి బదులిచ్చారు. రెండు సెకనులు అయినా కానీ రావాలి బాబా అని పిల్లలు సందేశం పంపించారు. అందరి సందేశం అయితే చేరింది. మీరు సంకల్పం చేయగానే అది బాప్ దాదా విన్నారు. అది మాటలోకి వచ్చేకంటే ముందే సంకల్పం చేరిపోతుంది.

సేవ కొరకు విదేశం వెళ్ళడానికి బాప్ దాదా నుండి నిర్వైర్ అన్నయ్య తెలవు తీసుకుంటున్నారు- వీరు కూడా వెళ్తున్నారా! అంటే ఎవరెడీ అయిపోయారు కదా! దీనినే మధురమైన డ్రామా అని అంటారు. మూడు బిందువుల యొక్క తిలకం అనే బహుమతి లభించింది కదా! సంకల్పం చేశారు. అంటే మూడు బిందువుల తిలకం తిరిగి పెట్టుకున్నారు. పెట్టబడే ఉంది కానీ తిరిగి పెట్టుకున్నారు. ఈ అవినాశి తిలకం సదా మస్తకంలో పెట్టబడి ఉంది కదా! మూడు బిందువులు వెనువెంట ఉన్నాయి కదా! ఈ తిలకం పెట్టి బాప్ దాదా వతనంలో మీకు స్వాగతం చెప్పారు. సరేనా! విశేషంగా ఏ స్వరూపం ద్వారా సందేశం ఇవ్వడానికి వెళ్తున్నారు? విశేషంగా ఏ పాఠాన్ని స్మృతి ఇప్పిస్తారు?

                సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ఉండండి - ఈ విశేష పాఠాన్నే అందరికీ అనుభవం ద్వారా చదివించాలి. అనుభవం ద్వారా పాఠం చదివించటమే అవినాశి పాఠం. విశేషంగా ఇదే నవీనత ఉండాలి - అనుభవం ఉంటూ అనుభవం చేయించాలి. నోటి ద్వారా చదువు అనేది చాలా సమయం నడిచింది. ఇప్పుడు అందరికీ ఈ చదువు అవసరం. ఈ విధి ద్వారా సర్వులను ఎగిరే కళలోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే అనుభవం అనేది చాలా చాలా గొప్ప శక్తి, ఎవరికైతే అనుభవం యొక్క శక్తి ఉంటుందో వారితో ఇక ఏ శక్తి యుద్ధం చేయలేదు. మాయ యొక్క శక్తి పని చేయదు.

కనుక విశేషంగా ఇదే విధిని బుద్ధిలో ఉంచుకుంటూ తిరిగి రండి. అప్పుడు నవీనత అవుతుంది. ఎక్కడికైనా ఎవరైనా వెళ్తుంటే ఏదైనా నవీనత వారి నుండి లభించాలి అని అందరూ అనుకుంటారు. మాట్లాడటం మరియు స్వరూపంగా అయ్యి స్వరూపంగా తయారు చేయటం రెండూ వెనువెంట ఉండాలి. మీకు కూడా ఇదే ఇష్టం కదా! డ్రామానుసారంగా ఇప్పుడు ఏదైతే సమయం నిశ్చయం అయ్యిందో అది సేవ కొరకు అని భావించండి. సంకల్పాలు సమాప్తి అయిపోయాయి కదా! ఎవరెడీగా అయ్యి అన్ని తయారీలు సెకనులో అయిపోయాయి కదా! స్థూల సాధనాలు అయితే అక్కడ అన్నీ ఉంటాయి.

 తయారైపోయిన సాధనాలు ఉంటాయి. ఏమైనా మిగిలిపోయినా పెద్ద విషయం కాదు. ఇక్కడి నుండి రెండు జతల బట్టలతో వెళ్ళినా పర్వాలేదు. రెడీమేడ్ బట్టలు అక్కడ దొరుకుతాయి. ఇక సూక్ష్మ తయారీలు అయితే అయిపోయాయి కదా! స్థూల తయారీలు పెద్ద విషయం కాదు. వారికి శుభవార్త వినిపించాలి. వినాశనం కాకూడదు అని వారు అనుకుంటున్నారు. ఈ ప్రపంచం స్థాపన అయ్యే ఉండాలి అనుకుంటున్నారు. వినాశనం అంటే ఎందుకు భయం? మా ఈ ప్రపంచం సమాప్తి అయిపోతుంది అని వారికి భయం. కానీ వినాశనం తర్వాత ఇంకా క్రొత్త ప్రపంచం రానున్నది. వారికి ఈ శుభవార్త అందాలి.

మా ఈ ప్రపంచం సదా వృద్ధిని పొందుతూ ఉండాలి. ఇంకా మంచిగా అవ్వాలి అని వారికి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం విశ్వ రచయిత అయిన బాబా దగ్గరకు చేరుకుంది అని చెప్పండి. మరియు విశ్వ యజమాని ద్వారా విశ్వంలో శాంతి స్థాపన యొక్క కార్యం ఇప్పుడు జరుగుతుంది, విశ్వంలో స్నేహం, ప్రేమ ఉండాలి, కొట్లాటలు, పోట్లాటలు ఉండకూడదు అని మీ అందరి ఆశ ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తి అయ్యే సమయం వచ్చింది అని వారికి చెప్పండి. కానీ ఇది ఏ విధి ద్వారా జరుగుతుందో ఆ విధిని తెలుసుకోండి, విధి యదార్ధంగా ఉంటే సిద్ధి కూడా లభిస్తుంది అని చెప్పండి.

 సిద్ధి అయితే లభించనున్నది కానీ ఏ విధి ద్వారా లభిస్తుంది అనేది వారికి తెలియదు. వారు కాన్ఫెరెన్లు అవి అయితే చేసి చూశారు. కానీ సంకల్పం అనేది మనస్సుతో రావటం లేదు. పోట్లాట-కోట్లాటల యొక్క బీజం సమాప్తి అయిపోతే ఇక ఆయుధాలు అవి తయారై ఉన్నా కానీ ఉపయోగించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయుధాలు నష్టం చేయవు కానీ నష్టం చేసేది - క్రోధం. బీజం - క్రోధం. అయితే విధిపూర్వకంగా బీజాన్నే సమాప్తి చేస్తే సిద్ధి లభించినట్లే. కొట్లాట - పోట్లాటల యొక్క బీజమే సమాప్తి అయిపోవాలి. అందువలన సర్వాత్మల యొక్క ఆశ పూర్తి అయ్యే సమయం వచ్చేసింది.

 సమయం అందరి బుద్ధిని ప్రేరేపిస్తుంది. గుప్తంగా ఏదైతే కార్యం జరుగుతుందో ఆ కార్యం అందరినీ ఆకర్షిస్తుంది కానీ ఈ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి అనేది వారికి తెలియదు. ఆయుధాలను తయారు చేసింది. వారే కానీ వాటిని ఉపయోగించకూడదనే సంకల్పం ఎందుకు వస్తుంది? అంటే స్థాపన యొక్క కార్యం వారిని ప్రేరేపిస్తుంది కానీ ఇది వారికి తెలియదు. దీని గురించి మీరు అనుకుంటారు-పరివర్తనా కార్యంలో వినాశనం జరగకుండా స్థాపన జరుగదు. కానీ వారి భావన కూడా మంచిదే.

 వారి భావనను అనుసరించి మీరు వారికి ఈ శుభవార్త వినిపిస్తే శాంతి సాగరుని ద్వారానే శాంతి స్థాపన జరుగుతుంది అనే విధి వారికి అర్థం అవుతుంది. మనమందరం ఒక్కటే, ఈ సౌబ్రాతృత్వ భావన దేని ఆధారంగా ఏర్పడుతుంది? ఇక వారికి ఈ సంకల్పమే రాకూడదు మరియు వారు ఇక ఏ శ్రమ చేయకూడదు. దానికి ఆధారం ఏమిటి? ఒకొక్కసారి ఆయుధాలు ఉపయోగించాలి అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఉపయోగించకూడదు అనుకుంటున్నారు. కానీ అసలు ఈ సంకల్పమే వారికి సమాప్తి అయిపోవాలి, సౌభ్రాతృత్వ భావన రావాలి. అదే విధి. సోదరులు అనే భావన వచ్చింది.

అంటే తండ్రి ఉండనే ఉంటారు. ఇలా శుభవార్త రూపంలో వారికి చెప్పండి. శాంతి యొక్క పాఠాన్ని వారికి చదివించాలి. శాంతి యొక్క విధి ద్వారా అశాంతి అయిపోతుంది. కానీ ఆ శాంతి వచ్చేది ఎలా? దాని కొరకు మంత్రం ఇవ్వాలి. శాంతి యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు కదా! నేను శాంత స్వరూపాన్ని నా ఇల్లు శాంతిధామం, నా తండ్రి శాంతిసాగరుడు, నా ధర్మం శాంతి. ఇలా వారికి పాఠం చదివించండి. శాంతియే శాంతి యొక్క పాఠం. రెండు సెకనులు అయితే అనుభవం చేసుకుంటారు కదా!

ఒక్క సెకను అయినా కానీ పూర్తి శాంతి యొక్క అనుభూతి వారికి అయ్యింది అంటే వారు మాటిమాటికి మీకు ధన్యవాదాలు చెస్తారు. మిమ్మల్నే భగవంతునిగా భావిస్తారు. ఎందుకంటే చాలా అలజడిలో ఉన్నారు కదా! బుద్ధి ఎంత పెద్దదో అంత అలజడి కూడా. ఇలా అలజడిగా ఉన్న అత్యలకు కొద్దిగా అయినా ప్రాప్తి దొరికితే అదే వారి జీవితానికి వరదానం అవుతుంది. ఎవరి గురించి అయినా అవకాశం లభించగానే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే శాంతిలోకి తీసుకువెళ్ళండి. ఒక్క సెకను అయినా వారిని అనుభూతిలోకి తీసుకువెళ్తే వారు చాలా చాలా ధన్యవాదాలు చెప్తారు.

 ఏవో శాంతి కిరణాలు వ్యాపించినట్లుగా అనుభవం అయ్యే విధంగా వాతావరణాన్ని తయారు చేయండి. ఒక లేదా అర సెకను అనుభవం అయినా కానీ అవ్వాలి. ఎందుకంటే ఈ అనుభవం అనేది వాయుమండలం ద్వారానే అవుతుంది. ఎక్కువ సమయం ఉండలేరు కానీ అర సెకను అయినా కానీ వాయుమండలం తేలికగా అనుభవం అయితే మనస్సు నుండి చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే చాలా గందరగోళంలో ఉన్నారు. వారిని చూసి బాప్ దాదాకి అయితే దయ వస్తుంది. రాత్రి నిద్ర ఉండదు. పగలు నిద్ర ఉండదు, భోజనం కూడా తినేవిధంగా తినరు.

 తమపై ఏదో భారం ఉన్నట్లు ఉంటారు. ఏమి అవుతుందో, ఎలా అవుతుందో అనుకుంటారు. ఇటువంటి ఆత్మలకి ఒక్కసారి అయినా మెరుపు అనుభవం అయితే ఏమౌతుంది? సూర్యుడు క్రిందకి దిగి వచ్చినట్లు భావిస్తారు. ఒక్కసారిగా మెరుపు కనిపించాలి. ఆ శక్తిని వారు ఎక్కువ సమయం కూడా ధారణ చేయలేరు. ఇది కొన్ని సెకనుల విషయం. అలా వచ్చి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాత్రం అనుభవం కూడా వారికి చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా అలజడితో ఉన్నారు. కొద్దిగా తీరం దొరికినట్లు అనుభవం అయినా కానీ ఎక్కువ అనుకుంటారు. మంచిది. సంకల్పం పూర్తి అయ్యింది.

 పిల్లల సంతోషంలోనే బాబాకి సంతోషం ఉంటుంది. సంతానమూర్తులు కదా! సఫలత అనేది వెంటే ఉంటుంది. బాబా వెంట ఉండగా సఫలత ఇంకెక్కడికి వెళ్తుంది? ఎక్కడ బాబా ఉంటారో అక్కడ సర్వ సిద్ధులు వెనువెంట ఉంటాయి. బిందువు పెట్టడం వస్తుందా లేక బిందువు గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయా? చిన్న బిందువు నుండి పెద్ద పాము వచ్చే దీపావళి మందులు ఉంటాయి కదా! అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టవలసింది బిందువు. బిందువులోనే అన్నీ ఇమిడిపోతాయి. కానీ సంకల్పం అనే అగ్ని అంటుకోగానే బిందువు పాము అయిపోతుంది. అగ్నిని అంటించకండి, పాముని రానివ్వకండి.

 బాప్ దాదా పిల్లల యొక్క ఈ ఆట చూస్తూ ఉంటారు. ఏదైతే జరుగుతుందో అన్నింటిలో కళ్యాణం ఉంటుంది. ఇలా ఎందుకు లేదా ఇది ఏమిటి అని అనుకోకూడదు. ఏవి అనుభవం చేసుకోవాలో వాటిని చేసుకున్నారు. పరివర్తన చేసుకున్నారు. ఇక ముందుకు వెళ్ళండి. బిందువు పెట్టడం అంటే ఇదే. విదేశీయులందరికీ కూడా ఈ ఆట గురించి చెప్పండి. వారికి ఇలాంటి విషయాలు ఇష్టంగా ఉంటాయి.

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

నిమిత్త భవ!