రివైజ్ కోర్స్ మురళి 11-01-1983                    

నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మ ఈ భూమిపై అవతరించి జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేయుచున్నారు.

పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన జ్ఞానమురళిని ఆత్మిక స్థితిలో చదవాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి మనము చేయవలసిన సంకల్పాలు:

1. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి.

2. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు.

3. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును.

4. శివపరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివపరమాత్మకి జీవిత భాగస్వామిని.

సర్వ సంబంధాలు బాబాతో జోడించి ఆ సంబంధం యొక్క కర్తవ్యాన్ని బ్రాహ్మణ జీవితంలో ఆచరించినప్పుడు ఆత్మిక స్థితి/యోగ స్థితి సహజమైపోతుంది.

ఆత్మిక స్థితిలో ఎవరికి వారు బాబా మురళి తమకే చెప్తున్నారు అన్న భావనతో చదవాలి.

'సమర్థుల గుర్తు- వారి సంకల్పాలు, మాటలు, కర్మలు, స్వభావ సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయి'.

            ఈరోజు ఆత్మిక తండ్రి తమ పిల్లలతో హృదయాభిరామునికి అందించిన హృదయపు సమాచారాన్ని గూర్చి అడిగేందుకు వచ్చారు. అందరూ హృదయాభిరామునికి తమ హృదయాన్ని ఇచ్చారు కదా! ఒక్క హృదయాభిరామునికి హృదయాన్ని ఇచ్చినట్లయితే వారు తప్ప ఇంకెవ్వరూ రాజాలరు. హృదయాభిరామునికి హృదయమునివ్వడము అనగా వారిని హృదయంలో ఉంచుకోవడము, దీనినే సహజయోగము అని అంటారు. ఎక్కడైతే హృదయం ఉంటుందో అక్కడే బుద్ధి కూడా నడుస్తుంది. కావున హృదయంలోను హృదయాభిరాముడు మరియు బుద్ధిలోను అనగా స్మృతిలో కూడా హృదయాభిరాముడు.

ఇంకే స్మృతి లేక వ్యక్తి హృదయాభిరాముని మధ్యకు రాజాలరు, ఇటువంటి అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడైతే హృదయము మరియు బుద్ధి అనగా స్మృతి, సంకల్పము, శక్తి అన్నింటినీ బాబాకు అర్పించేస్తారో అప్పుడిక మిగిలిందేమి? మనస్సు, వాణి మరియు కర్మల ద్వారా బాబాకు చెందినవారిగా అయిపోయారు. సంకల్పంలో కూడా మేము బాబాకు చెందినవారము అని అన్నారు మరియు వాణి ద్వారా కూడా ''బాబా నా వారు మరియు నేను బాబాకు చెంది ఉన్నాను'' అని అంటారు మరియు కర్మలో కూడా ఏ సేవనైతే చేస్తారో అది కూడా బాబా సేవయే, అది నా సేవ కాదు.

అలాగే మనస్సు, వాణి మరియు కర్మ ద్వారా కూడా బాబాకు చెందినవారిగా అయిపోయారు కదా! సంకల్పమాత్రంగా కూడా వచ్చేందుకు ఇక మార్జిన్ ఏముంది! ఏవిధమైన సంకల్పము లేక ఏవిధమైన ఆకర్షణ వచ్చేందుకు ఏదైనా తలుపు లేక కిటికి మిగిలి ఉందా? ఆ వచ్చే దారే మనస్సు, బుద్ధి, వాణి మరియు కర్మలు. కొద్దిగా అయినా ఎవరైనా వచ్చేందుకు మార్జిన్ అయితే లేదు కదా అని నలువైపులా పరిశీలించుకోండి. మార్జిన్ ఉందా? స్వప్నాలు కూడా ఇదే ఆధారంపై వస్తాయి. ఈ సర్వస్వము మీదే అని బాబాతో ఒక్కసారి అన్నాక ఇక మిగిలింది ఏమి? దీనినే నిరంతర స్మృతి అని అంటారు.

చెప్పడంలో మరియు చేయడంలో తేడా అయితే ఉంచడంలేదు కదా! మీది అన్న దానిలో నాది అనేది మిక్స్ అవ్వడంలేదు కదా! సూర్యవంశి అనగా స్వర్ణ యుగానికి చెందినవారు, అందులో కల్తీ ఉండదు కదా! వజ్రం కూడా మచ్చలేనిదిగా ఉండాలి. ఎటువంటి మచ్చ ఉండిపోలేదు కదా అని పరిశీలించుకోవాలి. సంకల్పాలలో కాని, మాటలలో కాని, సంస్కారాలలో కాని ఏదైనా బలహీనతను వర్ణించేటప్పుడు ఏమంటారు? నా ఆలోచన ఇలా చెబుతోంది లేక నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు. కాని బాబా సంస్కారాలేవైతే ఉన్నాయో అవే నా సంస్కారాలు, సంకల్పాలు.

బాబా వంటి సంకల్పాలు, సంస్కారాలు తయారైపోయాక నేనేం చేయను, నా స్వభావ సంస్కారాలు ఇలా ఉన్నాయి అని అన్న మాటలు ఎప్పుడూ పలుకజాలరు. ఏం చేయను అన్న ఈ పదమే బలహీనతతో కూడుకున్నది. సమర్థులకు గుర్తు- సదా బాబా సమానంగా మాటలు, కర్మలు, స్వభావ సంస్కారాలు ఉండాలి. బాబావి వేరుగా మరియు నావి వేరుగా ఉండజాలవు. వారి సంకల్పాలలో, మాటలలో, ప్రతి విషయంలో బాబా, బాబా అన్న పదం సహజంగా ఉంటుంది మరియు కర్మ చేస్తూ చేయించేవారు చేయిస్తున్నారు అన్నది అనుభవమవుతుంది.

ఎప్పుడైతే అందరిలోకి బాబా వచ్చేస్తారో అప్పుడిక బాబా ముందుకు మాయ రాజాలదు. బాబా అయినా ఉంటారు లేక మాయ అయినా ఉంటుంది. లండన్ నివాసులు బాబా, బాబా అంటూ, స్మృతిలో ఉంచుకుంటూ, సదాకాలికంగా మాయాజీతులుగా అయిపోయారా! ఎప్పుడైతే వారసత్వాన్ని సదాకాలికంగా తీసుకుంటారో మరప్పుడు స్మృతిని కూడా సదాకాలికంగా చేయాలి కదా! అలాగే మాయాజీతులుగా కూడా సదాకాలికంగా ఉండాలి. లండన్ సేవ యొక్క పునాది స్థానము. మరి పునాది స్థానంలో ఉండేవారు కూడా పునాది సమానంగా సదా దృఢంగా ఉన్నారా?

ఏం చేయాలి, ఎలా చేయాలి అనే కంప్లేయింట్ ఏదీ లేదు కదా! ఎక్కువగా డ్రామాలు కూడా మాయవే చేస్తారు కదా! మీరు తయారుచేసే ప్రతి డ్రామాలోనూ, లేని మాయ కూడా వచ్చేస్తుంది! మాయ లేకుండా డ్రామాను తయారుచేయలేరేమో, మాయకు కూడా భిన్న భిన్న స్వరూపాలను చూపిస్తారు కదా! ప్రతి విషయంలోను పరివర్తక స్వరూపము ఉండాలి... అలాంటి డ్రామాను చూపించండి. మాయ యొక్క ముఖ్య స్వరూపం ఏమి అన్నది మీకు బాగా తెలుసు. కాని మాయాజీతులుగా అయిపోయిన తర్వాత కూడా అదే మాయ యొక్క స్వరూపంగా ఎలా మారిపోతుందో దాని డ్రామాను తయారుచేయండి.

ఏవిధంగా శారీరక దృష్టిని దేనినైతే కామము అని అంటారో దానికి బదులుగా ఆత్మిక స్నేహం రూపంలోకి అది మారిపోతుంది... అలా అన్ని వికారాలు పరివర్తక రూపంగా అయిపోతాయి. కావున ఏమి పరివర్తన అయింది అన్నది ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి మరియు చూపించండి కూడా. లండన్ నివాసులు విశేషంగా స్వఉన్నతి కొరకు మరియు విశ్వకళ్యాణం కొరకు ఏ లక్ష్యమును ఉంచారు? సదా మేము ఉన్నదే ఫరిస్తాలుగా అన్నది విశేషంగా సదా అందరి స్మృతిలో ఉండాలి. ఫరిస్తాల స్వరూపం ఏమి, మాటలు ఏమి, కర్మలు ఎలా ఉంటాయి? వారు స్వతహాగానే ఫరిస్తాల రూపంలో నడుస్తూ ఉంటారు.

'నేను ఫరిస్తాను, ఫరిస్తాను' అన్న స్మృతినే సదా ఉంచుకోండి. బాబాకు చెందినవారిగా అయిపోయాక నాదంతటినీ మీదిగా చేసేసారు. మరి ఎలా అయిపోయారు? తేలికగా, ఫరిస్తాలుగా అయిపోయారు కదా! కావున ఈ లక్ష్యమును సదా సంపన్నం చేసేందుకు అంతా బాబాదే, నాదేమీ లేదు అన్న స్మృతిలో ఉండాలి. ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ నీది అని అనేయండి అప్పుడిక ఎవ్వరికీ భారంగా అనిపించదు. ప్రతి సంవత్సరము అడుగులు ముందుకు వెళుతున్నాయి మరియు సదా ముందుకు వెళుతూ ఉంటారు. ఎగిరే కళలో వెళ్ళే ఫరిస్తాలము అన్నది పక్కాగా ఉంది కదా! పైకీ క్రిందికీ, పైకీ క్రిందికీ అయ్యేవారిలా కాదు. అచ్ఛా!

                   

లండన్ నివాసుల మహిమను గూర్చి అయితే అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరూ ఏ దృష్టితో చూస్తారు? సదా మాయాజీతులుగా చూస్తారు ఎందుకంటే శక్తిశాలీ డబుల్ పాలన లభిస్తోంది. బాప్ దాదాల పాలన అయితే సదా ఉండనే ఉంది, కాని బాబా ఎవరినైతే నిమిత్తంగా చేశారో వారి శక్తిశాలీ పాలన కూడా లభిస్తోంది. నిరాకారుని, ఆకారుని మరియు సాకారుని ముగ్గురినీ అనుసరించినట్లయితే మీరు ఎలా అయిపోతారు? ఫరిస్తాలుగా అయిపోతారు కదా! లండన్ నివాసి అనగా నో కంప్లేయింట్, నో కన్ఫ్యూజన్ (ఎటువంటి ఫిర్యాదులు, తికమకలు లేనివారు). అలౌకిక జీవితంవారు, స్వరాజ్యం చేసేవారు. అందరూ రాజులు మరియు రాణులు కదా! మీకు ఆ నషా ఉంది కదా!

కుమారీలతో:- కుమారీలైతే తమ భాగ్యమును చూసి సదా హర్షితులవుతారు. కుమారీలు లౌకిక జీవితంలో కూడా ఉన్నతులుగా గాయనం చేయబడతారు మరియు జ్ఞానంలో కుమారీలు ఉన్నదే మహానుగా లౌకికంలో కూడా శ్రేష్ఠ ఆత్మలు మరియు పారలౌకికంలో కూడా శ్రేష్ఠ ఆత్మలు. ఈ విధంగా స్వయమును మహానులుగా భావిస్తున్నారా? అవును... అని మీరు ఎలా అనాలంటే మొత్తం ప్రపంచమంతా వినగలగాలి. కుమారీలనైతే బాప్ దాదా తమ హృదయపు పెట్టెలో ఎవరి దృష్టి పడకుండా ఉంచుతారు. మీరు ఇటువంటి అమూల్య రత్నాలు. కుమారీలు సదా చదువు మరియు సేవ... ఇందులోనే బిజీగా ఉంటారు.

 కుమారీ జీవితంలో బాబా లభించారు, ఇంకేం కావాలి? అనేక సంబంధాలలో భ్రమించవలసిన అవసరం లేకుండా సురక్షితులైపోయారు. ఒక్కరిలోనే సర్వసంబంధాలు లభించాయి లేకపోతే అత్తగారు, మరదళ్ళు, వదినలు... ఇలా ఎన్ని సంబంధాలు ఏర్పడతాయి! వాటన్నిటి నుండి సురక్షితులైపోయారు కదా! వలలోను చిక్కుకోలేదు అలాగే వల నుండి విడిపించే సమయమూ లేదు. కుమారీలు ఉన్నదే డబుల్ లైటుగా. కుమారీలు సదా బాబా సమానమైన సేవాధారులు మరియు బాబా సమానంగా సర్వ ధారణా స్వరూపులు. కుమారీ జీవితం అనగా పవిత్ర జీవితము, పవిత్ర ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు కదా!

కావున బాప్ దాదా కుమారీలను మహాన్ పూజ్య ఆత్మల రూపంలో చూస్తారు. పవిత్ర ఆత్మలు సర్వులకు ప్రియమైనవారిగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉంటారు. తమ భాగ్యమును సదా ముందు ఉంచుతూ సమర్థ ఆత్మగా అయి సేవలో సమర్థతను తీసుకువస్తూ ఉండండి, ఇదే పెద్ద పుణ్యము. స్వయానికి ఏదైతే లభించిందో దానిని ఇతరులకు కూడా ప్రాప్తింపజేయండి. ఖజానాలను పంచడం ద్వారా ఆ ఖజానా ఇంకా పెరుగుతుంది అన్న శుభ సంకల్పాన్ని ఉంచేది కుమారీలే కదా! అచ్ఛా!

టీచర్లతో:- విశ్వపు షోకేసులో మీరు విశేష షోపీసులు కదా! అందరి దృష్టి నిమిత్తంగా అయిన సేవాధారులు అనండి, శిక్షకులు అనండి వారివైపే ఉంటుంది. మీరు సదా స్టేజిపై ఉన్నారు, ఇది ఎంత పెద్ద స్టేజ్ మరియు చూసేవారు కూడా ఎంతమంది ఉన్నారు! అందరూ నిమిత్త ఆత్మలైన మీపై ప్రాప్తి యొక్క భావనను కలిగి ఉంటారు. సదా ఇది స్మృతిలో ఉంటుందా? సెంటర్లో ఉంటున్నారా లేక స్టేజిపై ఉంటున్నారా? సదా బేహద్దులోని అనేక ఆత్మల మధ్య చాలా పెద్ద స్టేజిపై ఉన్నారు. కావున సదా దాత పిల్లలైన మీరు ఇస్తూ ఉండండి మరియు సర్వుల భావనలు మరియు సర్వుల ఆశలను పూర్తి చేస్తూ ఉండండి.

మహాదానులుగా మరియు వరదానులుగా అవ్వండి, ఇదే మీ స్వరూపము. ఈ స్మృతి ద్వారానే ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మ హీరో పాత్ర సమానంగా ఉండాలి ఎందుకంటే విశ్వంలోని ఆత్మలు ఇవి చూస్తున్నాయి. సదా స్టేజిపైనే  ఉండాలి, క్రిందకు రాకూడదు. నిమిత్త సేవాధారులను బాప్ దాదా తమ మిత్రులుగా భావిస్తారు. ఎందుకంటే బాబా కూడా శిక్షకులే... కావున మీరు బాబా సమానంగా నిమిత్తంగా అయ్యే ఫ్రెండ్సే కదా! కావున మీరు ఇంత సమీప ఆత్మలు. ఈవిధంగా సదా స్వయమును బాబాకు తోడుగా లేక సమీపంగా అనుభవం చేసుకుంటున్నారా?

ఎప్పుడు బాబా అని అన్నా వేలాది భుజాలతో బాబా మీ తోడుగా ఉంటారు. ఈ విధంగా అనుభవమవుతోందా? ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి బాప్ దాదా అదనపు సహయోగమును అందిస్తారు. కావున ఎంతో నషాతో బాబా అని అనండి, పిలవండి, పిలిచినట్లయితే బాబా హాజరైపోతారు. బాప్ దాదా వినమ్రుడైన వారు కదా! అచ్ఛా!

మురళి చదివిన తరువాత పరమశిక్షకుడు, సద్గురువైన శివబాబా తెలియజేసిన విధి 'మనన చింతన'.

మనన చింతన చేసే విధి శివబాబా నాలుగు మురళీలలో తెలియజేసారు.

01.02.1979

23.12.1987

10.01.1988

07.04.1981

దివ్య బుద్ధికి మననశక్తియే ఆహారం.

"ప్రతి వాక్యం యొక్క రహస్యం ఏమిటి?, ప్రతి వాక్యాన్ని ఏ సమయంలో, ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి? మరియు ప్రతి వాక్యాన్ని ఇతరాత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి?" - ఇలా నాలుగు రకాలుగా ప్రతి వాక్యాన్ని మననం చేయాలి.

జ్ఞానం యొక్క మనన చింతన ద్వారా సమర్ధ సంకల్పం, సమర్ధ స్థితి మరియు శక్తిశాలి స్మృతిలో ఉంటాము.

జ్ఞానం యొక్క స్మృతి(మనన చింతన) ద్వారా మనకు జ్ఞాన దాత శివబాబా యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది.

మనన చింతన చేయడానికి ఉపయోగపడే సంకల్పాల కొరకు "సమర్ధ సంకల్పాల ఖజానా" నిలువు వరుస శీర్షిక(Column)లో చూడగలరు.

మనన చింతన మురళీల కోసం ఈ లింకును తాకండి.

విజయీ భవ!